Posts

Showing posts from December, 2024

హరి చందనంబు మేనునఁగర మొప్పెడు హస్తినులను గంకణరవముల్

హరి చందనంబు మేనునఁ గర మొప్పెడు హస్తములను గంకణరవముల్ ఉరమున రత్నము మెఱయఁగ పరఁగితివో నీవు బాలప్రాయము కృష్ణా! భగవంతుడు చిన్నతనంలోని అమాయకత్వం,తల్లితండ్రుల ప్రేమ ఆస్వాదించాలనుకున్నాడో,ఏమో?అందుకేనేమో కృష్ణావతారంలో తనివితీరా అనుభవించాడు.ఇక్కడ కవి కృష్ణుడి చిన్నతనపు ముద్దు ముచ్చటలు ప్రస్తావిస్తున్నాడు.బుజ్జి కృష్ఞుడు,బాల కృష్ణుడు ఒంటికి అంతా చందనం పూసుకొని వున్నాడట.తన బుల్లి,లేత చేతులకు కంకణాలు వేసుకుని వున్నాడట.మెడలోని దండకు రత్నం మెరిసి పోతుందట.కంకణాలు చెవులకు వినసొంపైన శబ్దాలు చేసేలా బంగారు కిట్టయ్య అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడట!సూర్యకిరణాలకు ఆ రత్నం మెరుస్తున్నదట!ఇదంతా చూడగలిగిన ఆ యశోద ఎంత అదృష్టవంతురాలో కదా!

అందెలు గజ్జెలు మ్రోయఁగఁ

అందెలు గజ్జెలు మ్రోయఁగఁ జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల ముఱియుచు కృష్ణా! కృష్ణుడి చిన్నతనం అంతా గోపాలకులతో,గోకులంలో గడిచింది.యశోద చాలా పుణ్యం చేసుకుంది.ఎందుకంటే,బాలగోపాలుడు అయిన కృష్ణుడు తన బుడి బుడి అడుగులతో,చిన్నతనపు చేష్టలతో ఆమె మనసు తనివితీరేలా చేసాడు.బుజ్జి కృష్ణుడు,తన పాదాలకున్న గజ్జెలు ఘల్లు ఘల్లు మంటుండగా ఇల్లూ వాకిలి అంతా సంతోషంతో చిందులు త్రొక్కుతున్నాడు.అతని అమాయకపు మాటలు,చేతలు,గెంతులు,ఆటలతో ఆ నందుని సతి అయిన యశోద తన్మయత్వం చెందుతుంది,మురిసి పొతుంది.ఇదంతా నీకే సాథ్యం కృష్ణా!

అల్ల జగన్నాథుకు రే

అల్ల జగన్నాథుకు రే పల్లియ క్రీడార్థ మయ్యెఁ బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయుఁ దల్లియునై చన్నుఁ గుడిపిఁ దనరగ కృష్ణా! కృష్ణుడు లోకాలన్నిటినీ పాలించే జగన్నాథుడు.అతనికి చిన్న వయసులో ఆడుకునేదానికి రేపల్లె క్రీడా స్థలం అయింది.యశోద కృష్ణుడిని పెంచిన తల్లి,ప్రేమ పంచిన తల్లి.ఆమె ఒక సామాన్యమయిన గొల్ల వనిత.ఆమెకు భగవంతుడికి చనుబాలు ఇచ్చే అదృష్టం దక్కింది.ఆ భగవంతుడు లీలా వినోదుడు కాబట్టే ఇవన్నీ అవలీలగా జరిగిపోయాయి.

అష్టమి రోహిణి ప్రొద్దున

అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్ దుష్టునిఁగంసు వధింపవె సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా! కృష్ణుడు రోహిణీ నక్షత్రం,అష్టమి తిథిలో పుట్టాడు.అందుకే మనం కృష్ణాష్టమి పండుగ చేసుకుంటాము ఆయన పుట్టిన రోజున.ఆయన దేవకీ గర్భంలో ఎనిమిదో సంతానంగా పుట్టాడు.చిన్న వయసులోనే దుష్టుడు అయిన తన మేనమామ,కంసుని వధించాడు.ఇది కక్షసాథింపు చర్యగా చెయ్యలేదు.లోక కల్యాణం కోసమే చేసాడు.ఈ సృష్టిని రక్షించే దాని కోసం చేసాడు.

పదునాలుగు భువనంబులు

పదునాలుగు భువనంబులు కుదురుగ నీ కుక్షి నిల్పుకొని నేర్పరివై విదితంబుగ నా దేవకి యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా! కవి కృష్ణుడిని చూసి ఆశ్చర్య పోతున్నాడు.ఎందుకంటే ఇందుకే.ఆయనే ఒక పరబ్రహ్మ అయి పదునాలుగు భువనభాండాలను తన కడుపులో దాచుకున్నాడు.అట్లాంటి ఆయన దేవకి అయిన తన తల్లి,ఒక సామాన్యమయిన మహిళ, ఉదరంలో ఎలా ఒదిగి వుండగలిగాడు అనేదే విడ్డూరమయిన,ఆశ్చర్యం కలిగించే విషయం.

వేదంబులు గననేరని

వేదంబులు గననేరని యాది పరబ్రహ్మమూర్తి యనఘ!మురారీ! నా దిక్కుఁ జూచి కావుము నీ దిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా! హే కృష్ణా!ముర అనే రాక్షసుడిని చంపిన దుష్టశిక్షకుడివి.ఎలాంటి పాపములు అంటని వాడివి.వేదములు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాయి.ఆది అంతం,చావు పుట్టుకలు లేని పరబ్రహ్మమూర్తివి నీవు.నా దిక్కున చూసి,నన్ను కరుణించుము స్వామీ!నిజంగా నీవే నాకు దిక్కు అని మనసా,వాచా,కర్మణా నమ్మినాను.

ఓ కారుణ్య పయోనిధీ!

ఓ కారుణ్య పయోనిధీ! నా కాధారంబ వగుచు నయముగఁ బ్రోవన్। నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత!లోకనాయక!కృష్ణా! హే కృష్ణా!నీవు కరుణా సముద్రుడివి. నీవే నాకు గతివి,పతివి అని గట్టిగా నమ్ముకున్నాను.నన్ను రక్షించేదానికి నా పక్కన నువ్వుంటే ఇంక నాకు దిగులు,విచారం దేనికి?స్వర్గాధిపతి,దేవేంద్రుడు కూడా నిన్ను సదా కొనియాడుతుంటాడు.ముల్లోకాలకూ నాయకుడివి నీవు.అలాంటి నీ సంరక్షణలో వున్న నాకు భయం దేనికి?

నందుని ముద్దుల పట్టిని

నందుని ముద్దులపట్టిని మందర గిరిధరుని హరిని మాధవు విష్ణున్ సుందరరూపుని మునిగణ వందితు నిను దలతు భక్తవత్సల!కృష్ణా!॥8॥ కృష్ణా!నీవు నందుడి ఇంట వెలిసిన వాడవు.వాళ్ళ గారాలపట్టివి,ముద్దుల బిడ్డవు.చిటికెన వేలు మొనపై సునాయాసంగా మందర గిరిని ఎత్తుకున్నవాడవు.నీకున్న సహస్రనామాలలో హరి,మాధవుడు,విష్ణువు అనేవి మచ్చుకు కొన్ని నామాలు.సుందరమయిన రూపం కలిగిన మేఘశ్యాముడవు.నిన్ను మునులు,ఋషులు,దేవతలు,ఇతర గణాలు సదా పూజిస్తూ ఉంటారు. హే భక్తవత్సలా!హే కృష్ణా!నిన్ను నేను సర్వవేళలలో స్మరిస్తూ ఉంటాను.నన్ను కరుణించు తండ్రీ!

అక్రూరవరద!మాధవ!

అక్రూరవరద!మాధవ! చక్రాయుధ!ఖడ్గపాణి!శార్ఞి!ముకుంద! శక్రాది దివిజ సన్నుత! శుక్రార్చిత!నన్నుఁగరుణ జూడుము కృష్ణా! హే కృష్ణా!మాధవా!నీవు అక్రూరుడు మొదలైన భక్తులను కాపాడి,వారి కోర్కెలను తీర్చావు.చక్రము,ఖడ్గము మొదలైన ఆయుధాలను థరించి ఉంటావు.ధనములనొసగే శ్రీమహాలక్ష్మికి భర్తవు నీవు.ఇంద్రుడు మొదలైన దేవతలను,ఇతర దేవగణాలను కూడా రాక్షసుల బారి నుండి పలుమార్లు కాపాడావు.వాళ్ళందరూ నిన్ను ఎప్పుడూ కీర్తిస్తూ,భజిస్తూ ఉంటారు.హే ముకుందా!భక్తవరదా!నన్నుకూడా నీ చల్లని కరుణా కటాక్షాలతో చూడు స్వామీ!నా జన్మ ధన్యం అయేలా చేయి జగత్ రక్షకా!

చిలుకనొక రమణి

చిలుక నొక రమణి ముద్దుల చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షము నిచ్చితి నలరఁగ నినుఁ దలంచు జనుల కరుదా కృష్ణా! భగవంతుడు భక్తసులభుడు అంటారు.ఇది ముమ్మాటికీ నిజం.ఒక రమణీమణి ముద్దుగా ఒక చిలుకను పెంచుకుంది.ఆ చిలుకకు తన భర్త పేరు,శ్రీరామ,అని పెట్టుకుంది.దానిని ప్రేమగా శ్రీరామ,శ్రీరామ అంటూ పిలుచుకుంటూ ఉండేది.ఆ మాత్రానికే భగవంతుడు ఆమెకు మోక్షం ప్రసాదించాడు.శ్రీరామ అనే మంత్రం ఎంత శక్తిమంతము అయినదో అర్థం అవుతుంది కదా!అంత సునాయసంగా మోక్షం ప్రసాదించే భగవంతుడికి,ఆయనను కొలిచే భక్తులకు కొరత,కొరవ ఉంటుందా!!?

క్రూరాత్ముఁ డజామిళుఁడు

క్రూరాత్ముఁ డజామీళుఁడు నారాయణ యనుచు నాత్మ నందనుఁ బిలువన్ ఏరీతి నులుకొంటివి ఏరీ నీ పాటి వేల్పు లెందును కృష్ణా! అజామిళుడు దారి తప్పి,చెడు మార్గంలో జీవించాడు.కానీ జీవిత చరమాంకంలో,యమభటులు తనను తీసుకెళ్ళేదానికి వచ్చారు.అప్పుడు తన చిన్న కొడుకు పేరును నారాయణ, నారాయణ అని పిలిచాడు.అతనికి యమదూతలు,విష్ణుదూతల సంవాదం వినిపిస్తుంది.దానితో అతని అజ్ఞానపు పొరలు పటాపంచలు అవుతాయి.అతను తన శేష జీవితాన్ని భక్తి మార్గంలో గడుపుతాడు.అంటే దేవుడినామం యొక్క మహత్త్వం తెలుస్తుంది.అజామిళుడు దేవుడి స్మరణ చేయలేదు.దేవుడి పేరు తన కుమారుడికి పెట్టుకున్నందున,అతని పేరు ఉచ్ఛరించాడు.అయినా దేవుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందుకే ఓ కృష్ణా!నీకు సాటి వేరే ఏ ఇతర దేవుళ్ళు లేరు.

హరి యను రెండక్షరములు

హరియను రెండక్షరములు హరియించును పాతకంబు లంబుజనాభా! హరి నీ నామ మహత్త్వము హరిహరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా! హరీ!హరి అనే రెండే రెండు అక్షరాలు,మనం చేసే పాపాలనన్నిటినీ పారద్రోలుతాయి.నాభిలోనుంచి కమలం ఉద్భవించినవాడివి నీవు.నీ నామ మహత్త్వము అంతా ఇంతా కాదు.నిన్ను సముచితంగా పొగడగలగటం అనేది మానవమాత్రులకు సాథ్యం అయ్యే పనికాదు.హే శ్రీ కృష్ణా!మమ్ములను కాపాడు తండ్రీ!

నారాయణ! పరమేశ్వర!

నారాయణ!పరమేశ్వర! ధారాధర నీలదేహ!దానవవైరీ! క్షీరాబ్థిశయన యదుకుల వీరా!ననుఁ గావు కరుణ వెలయగ కృష్ణా! ఓ కృష్ణా!నారాయణుడివి నీవే.నీవు పరమేశ్వరుడివి.ఈ భూమి కంతటికీ ఆథారభూతుడివి.నీలమేఘశ్యాముడివి.దుష్టులైన దానవులకు శత్రువువు.పాలసముద్రములో శయనించి,సేదతీరేవాడివి.యాదవకులంలో జన్మించిన వీరుడివి.నన్ను కాపాడు స్వామీ!నాపైన నీ కరుణాకటాక్షాలు వెదజల్లు తండ్రీ!

నీవే తల్లివి దండ్రివి

నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ నీవే గురుఁడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా! హే కృష్ణా!నీవే నాకు తల్లివి,తండ్రివి.నీవే నాకు తోడు నీడ ఇచ్చేవాడివి.నాకు మంచి స్నేహితుడివి కూడా నువ్వే.నాకు సకలమూ నేర్పించే గురువు కూడా నువ్వే.అన్నిటికన్నా ముఖ్యమయిన నా దేవుడివి కూడా నువ్వే.నువ్వే నాకు పతివి.నాకు మోక్షం చూపించే గతివి కూడా నువ్వే.నేను ఇవన్నీ ఊరికే ముఖస్తుతికి చెప్పడం లేదు.ముమ్మాటికీ నూటికి నూరుపాళ్ళు నిజం.మన తల్లి దండ్రులు ఎంత ఆపేక్షగా,ముద్దుగా మురిపెంగా చూసుకుంటారో,అలానే పరమాత్మ మన ఆలన పాలన చూస్తాడు.

శ్రీ రుక్మిణీశ!కేశవ!

శ్రీరుక్మిణీశ!కేశవ! నారద సంగీతలోల!నగధర శౌరీ! ద్వారకనిలయ!జనార్దన! కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా! కృష్ణా!నీవు రుక్మిణీపతివి.కేశవుడవు.ద్వారకలో నివసించేవాడివి.జనార్దనుడివి.ఆదిశేషువు పైన పవళించేవాడివి.కాళింది మడుగులో అయిదు తలల శేషువు పైన నాట్యమాడిన శూరుడివి.నారదుని సంగీతానికి మోహితుడైనవాడివి.కరుణతో మమ్మల్ని కాపాడు తండ్రీ!